Yuvraj Singh: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్‌

  • 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువీని నియామిస్తూ ఐసీసీ ప్ర‌క‌ట‌న‌
  • ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్న యువ‌రాజ్ 
  • జూన్ 2 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ
  • జూన్ 5వ తారీఖున ఐర్లాండ్‌తో భార‌త్ తొలి మ్యాచ్
ICC named Yuvraj Singh as the ambassador for T20WC

2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌య్యాడు. ఈ మేర‌కు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు. 2007లో జ‌రిగిన మొద‌టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌రఫున ప్రాతినిధ్యం వ‌హించిన యువీ.. టైటిల్ గెలవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోనే ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువ‌రాజ్ ఆరు బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు బాదాడు. 

కాగా, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ టోర్నీ ముగిసిన రోజుల వ్య‌వ‌ధిలోనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ ఐసీసీ టోర్నీకి తెరలేవ‌నుంది. జూన్ 29న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు, ఐదు గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డ‌నున్నాయి. గ్రూప్‌-ఏలో టీమిండియాతో పాటు కెన‌డా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 5వ తారీఖున ఐర్లాండ్‌తో భార‌త్ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఇక టోర్నీలోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన భార‌త్‌, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది. జూన్ 9వ తేదీన ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

More Telugu News